టాలీవుడ్ నటి మంచు లక్ష్మికి (Manchu Lakshmi) సోషల్ మీడియాలో షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆమె అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ఇటీవల హ్యాక్ అయింది. ఈ విషయాన్ని స్వయంగా మంచు లక్ష్మి తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో వెల్లడిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హ్యాకింగ్ జరిగిన అనంతరం నైజీరియా నుంచి తనకు గుర్తుతెలియని నంబర్ల నుంచి బెదిరింపులు వస్తున్నాయని, కాల్స్తో పాటు మెసేజ్లు కూడా వస్తున్నాయని పేర్కొన్నారు. “నా ఇన్స్టా హ్యాక్ అయింది. ఎవరి మెసేజ్ అయినా వస్తే స్పందించకండి.
నాకు ఏమైనా డబ్బులు కావాల్సి వస్తే నేరుగా అడిగేస్తాను. ఇలా ఆన్లైన్ ద్వారా అడగను” అని హెచ్చరించారు. ప్రస్తుతం తన ఇన్స్టా ఖాతా ఆమె నియంత్రణలో లేదని, తిరిగి పొందిన తర్వాత అప్డేట్ ఇస్తానని చెప్పారు. దీనితో పాటు భయాందోళన వ్యక్తం చేస్తూ, “నైజీరియా నుంచి బెదిరింపులు వస్తున్నాయి. ఫోన్ చేయండి, మెసేజ్ చేయండి అని ఒత్తిడి చేస్తున్నారు. భయంగా ఉంది” అని రాసుకొచ్చారు.
ఈ ఘటనపై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. “నైజీరియా నుంచి వచ్చే కాల్స్కు వెంటనే రిపోర్ట్ చేయండి”, “అధికారికంగా పోలీసులకు సమాచారం ఇవ్వండి” అంటూ సూచనలు చేస్తున్నారు. సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్లో ఉండే ఈ రోజుల్లో, ఈ రకమైన హ్యాకింగ్లు డేంజర్గా మారుతున్నాయి. హ్యాకింగ్ ద్వారా వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం చేసే అవకాశం ఉండటంతో వారంతా ఎక్కువ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
మంచు లక్ష్మి విషయంలోనూ ఇదే పరిస్థితి. ఆమె తన అభిప్రాయాలను నిర్భయంగా పంచుకునే నటిగా పేరు తెచ్చుకున్నారు. మొత్తానికి మంచు లక్ష్మి ఇన్స్టా హ్యాకింగ్ కేసు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. సెలబ్రిటీల అకౌంట్లు టార్గెట్ అయ్యే విషయంలో ఇప్పటికే ఎన్నో ఉదాహరణలు ఉన్నా, ఇప్పటికీ సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు మంచు లక్ష్మి త్వరగా తన ఖాతా తిరిగి సంపాదించుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.