నిన్న విడుదలైన “అఖండ 2” (Akhanda 2) టీజర్ కంటెంట్ పరంగా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో.. రిలీజ్ పరంగానూ అదే స్థాయి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. నిజానికి సెప్టెంబర్ 25 డేట్ ను ముందు అనౌన్స్ చేసింది “అఖండ 2” టీమ్. ఆ తర్వాత “సంబరాల ఏటి గట్టు” (Sambarala Yeti Gattu Carnage) కూడా అదే తేదీకి వస్తున్నట్లు అనౌన్స్ చేశారు. దాంతో మళ్లీ మెగా వర్సెస్ నందమూరి అనుకున్నారు జనాలు. కట్ చేస్తే.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) “ఓజీ” (OG) టీమ్ సడన్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది.
సెప్టెంబర్ 25ని లాక్ చేయడంతో.. ఆటోమేటిక్ గా “సంబరాల ఏటిగట్టు” వేరే రిలీజ్ డేట్ ను వెత్తుకోవడం మొదలుపెట్టగా.. “అఖండ 2” పోస్ట్ పోన్ అవుతుందేమో అనుకున్నారు జనాలు. కట్ చేస్తే.. నిన్న బాలయ్య (Nandamuri Balakrishna) పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ తో సెప్టెంబర్ 25కే వస్తున్నట్లు కన్ఫర్మ్ చేసారు మేకర్స్. దసరా పండుగ కాబట్టి ఎవరో ఒకరు వెనక్కి తగ్గుతారు అనుకున్నారు ఇండస్ట్రీ జనాలు.
అందులోనూ బాలయ్య, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇద్దరు కూటమి ప్రభుత్వంలో కీలక సభ్యులు. ఇప్పుడు వారిద్దరి మధ్య హీరోలుగా సఖ్యత కంటే.. రాజకీయ నాయకులుగా స్నేహం ఉంది. అందుకే.. ఒకరు తగ్గి, మరొకరు వెనక్కి వెళ్లడం గట్రాలు లేకుండా ఇద్దరూ ఒకేసారి వచ్చేందుకు సమాయత్తమవుతున్నారని తెలుస్తోంది. దసరా తెలుగు ప్రజలకి పెద్ద పండగే కాబట్టి థియేటర్ల స్క్రీన్ నెంబర్ల విషయంలో తప్పితే.. కలెక్షన్స్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.
కాకపోతే.. మొదటి రోజు కలెక్షన్స్ మీద మాత్రం ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. కానీ.. ఇద్దరు బడా స్టార్ హీరోలు కలిసి ఒకేరోజున వస్తే మాత్రం జనాలు థియేటర్లకి పరుగు పెట్టడం ఖాయం. అందువల్ల మొదటిరోజు కలెక్షన్స్ కాస్త ఎఫెక్ట్ అయినా.. లాంగ్ రన్ లో మాత్రం మంచి లాభాలు వస్తాయి. మరి నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? థియేటర్లను ఎలా పంచుకుంటారు? అనేది ప్రస్తుతం చర్చనీయాంశం.