చిరంజీవి (Chiranjeevi) – మల్లిడి వశిష్ట కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘విశ్వంభర’ (Vishwambhara). ప్రీ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ పనుల్లో బిజీగా ఉన్న టీమ్ పెండింగ్ ఉన్న ఆ ఒక్క పాటను త్వరలో షూట్ చేయాలని ప్లాన్ చేస్తోంది. దీంతో గత కొన్ని రోజులుగా ఆ పాట గురించి ఏదో వార్త వస్తూనే ఉంది. తొలుత సంగీత దర్శకుడు మార్పు, తర్వాత ఐటెమ్ భామ ఎవరు అనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ పాట ఒరిజినల్ కాదు రీమిక్స్ అని అంటున్నారు.
అందుకే భీమ్స్ సిసిరోలియో తెర మీదకు వచ్చారు అని తెలుస్తోంది. చిరంజీవి సినిమాల్లో ఐటెమ్స్ సాంగ్స్ చాలా ఉన్నాయి. అందులో దాదాపు అన్నీ మంచి ఊపు ఉన్నవే. అలాంటి వాటిలో ‘అన్నయ్య’ సినిమాలోని ‘ఆట కావాలా పాట కావాలా..’ ఒకటి. చిరంజీవి, సిమ్రన్ మీద తెరకెక్కిన ఆ పాట ఇప్పుడు చూసిన అదే వైబ్ వస్తుంది.
ఇప్పుడు అదే పాటను రీమిక్స్ చేసి కొత్త సౌండింగ్కి తగ్గట్టుగా ‘విశ్వంభర’లో పెడుతున్నారు అని సమాచారం. ఆ పనిని భీమ్స్ సిసిరోలియోకి అప్పజెప్పారు అని సమాచారం. ఆ పని ఓ కొలిక్కి వచ్చింది అంటున్నారు. త్వరలో పాట రిహార్సిల్స్ స్టార్ట్ చేస్తారట. ఇక ఈ పాటలో చిరంజీవి సరసన దక్షా నగార్కర్ ఆడిపాడుతుంది అని తొలుత వార్తలొచ్చాయి. ఆమె ఫిక్స్ అని కూడా చెప్పారు.
అయితే ఏమైందో ఏమో ఇతర నాయికల పేర్లు ఇప్పుడు వినిపిస్తున్నాయి. కన్నడ సినిమాకు చెందిన నిష్విక నాయుడు పేరు కొన్ని రోజులు వినిపించగా, ఇప్పుడు బాలీవుడ్ నాగిని మౌనీ రాయ్ పేరు వినిపిస్తోంది. మరి ఎవరు ఫిక్స్ అయ్యారో రిహార్సిల్స్ స్టార్ట్ అయితే తెలుస్తుంది. ఇక రీమిక్స్ లీక్ వల్ల మరో విషయం కూడా తేలిపోయింది. సినిమా ఆఖరి పాటకు కీరవాణి దూరమవ్వడానికి రీమిక్సే కారణం అని అంటున్నారు. ఆ పని ఇష్టం లేకనే కీరవాణి ఆగారా లేదా అనేది టీమే చెప్పాలి.