మంచు కుటుంబం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించేసిన చిత్రం ‘కన్నప్ప’ (Kannappa) . ఈ సినిమాతో భక్త కన్నప్ప జీవితాన్ని వెండితెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రిలీజ్ చేసే ప్రయత్నం మాత్రం చాలా రోజులుగా జరుగుతూనే ఉంది. ఎందుకో కానీ.. సినిమా వరుస వాయిదాలు పడుతూ ఎట్టకేలకు జూన్ 27న వస్తుంది అని చెబుతున్నారు. అయితే ఈ సమయంలో రెండు అంశాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అందులో రెండు పాత్రలకు పెట్టిన పేర్లు ఒకటైతే..
రెండోది ఓటీటీ డీల్ ఇంకా పూర్తి కాకపోవడం. ఈ విషయం గురించి మంచు విష్ణు (Manchu Vishnu) క్లారిటీ ఇచ్చారు. ఇండియన్ సినిమాలో ప్రస్తుతం రూపొందిన అతి పెద్ద చిత్రంగా ‘కన్నప్ప’ సినిమాను చెప్పొచ్చు. ప్రభాస్ (Prabhas), మోహన్ లాల్(Mohanlal), అక్షయ్ కుమార్ (Akshay Kumar), కాజల్ (Kajal Aggarwal) ఇలా అగ్ర తారాగణమంతా అతిథి పాత్రల్లో రూపొందిన ఈ సినిమాలో మంచు విష్ణు కథానాయకుడు. ఇంత భారీ కాన్వాస్ ఉన్న ఈ సినిమా ఓటీటీ డీల్ ఇంకా పూర్తి కాలేదు. ఎందుకు, ఏంటి అని విష్ణును అడిగితే.. ఓటీటీ ఆఫర్లు వచ్చాయి కానీ తాము అడిగిన రేట్కి వాళ్లు ముందుకు రాలేదని చెప్పాడు.
సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయితే తాను అడిగిన రేట్ ఇస్తారని అనడంతో ఆ మొత్తం రెడీ చేసుకోమని చెప్పినట్టు విష్ణు తెలిపాడు. ఇక రెండో అంశం.. సినిమాలోని రెండు పాత్రలకు పిలక – గిలక అనే పేర్లు పెట్టడం. ఈ విషయంలో బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై మంచు విష్ణు మాట్లాడుతూ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అవ్వక ముందే శ్రీకాళహస్తి ప్రధాన అర్చకులకు సినిమా చూపించామని, ఏమైనా తప్పులు ఉంటే చెప్పమని కోరామని తెలిపాడు.
సంస్కృత కాలేజీ ప్రిన్సిపల్, శ్రీకాళహస్తి టెంపుల్ ఛైర్మన్ కూడా సినిమా చూశారని.. సినిమా మొత్తం చూసి ఒక్క డైలాగ్ కూడా మార్చనక్కర్లేదని ప్రధాన అర్చకులు చెప్పారని మంచు విష్ణు తెలిపాడు. ప్రధాన అర్చకులే సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత సినిమాలో మార్పుచేర్పులు చేయాల్సిన అవసరం లేదని తేల్చేశాడు విష్ణు. అయితే బ్రాహ్మణ పాత్రలకు అభ్యంతరకర పేర్లు పెట్టడం బాగాలేదని.. లేదంటే కోర్టుకు వెళ్తామని బ్రాహ్మణ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.