మాస్ మహారాజ్ రవితేజకి (Ravi Teja) అర్జెంటుగా ఒక హిట్టు కావాలి. ‘ధమాకా’ (Dhamaka) తర్వాత ‘రావణాసుర’ (Ravanasura) ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao) ‘ఈగల్’ (Eagle) ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) వంటి డిజాస్టర్లు ఇచ్చాడు రవితేజ. ఈ సినిమాల వల్ల రవితేజ మార్కెట్ కూడా చాలా డౌన్ అయ్యింది. సరైన బిజినెస్ జరగడం లేదు అని భావించి.. ‘మైత్రి’ వారు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) – రవితేజ కాంబినేషన్లో చేయాల్సిన ప్రాజెక్ట్ ను పక్కన పెట్టారు. అలాగే రవితేజ కూడా రూ.30 కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేస్తున్నాడు అనే టాక్ కూడా ఉంది.
ఇప్పుడు అతను పారితోషికం కూడా తగ్గించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే ముందుగా అతనికి ఒక ఆప్షన్ ఉంది. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్లో రవితేజ ఒక సినిమా చేస్తున్నాడు. అదే ‘మాస్ జాతర’ (Mass Jathara). దీని షూటింగ్ చాలా వరకు పూర్తికావచ్చింది. దసరా టైంకి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది హిట్ అయ్యి.. బిజినెస్ బాగా చేస్తే, నెక్స్ట్ సినిమాకి రవితేజపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. ‘మాస్ జాతర’ తర్వాత రవితేజ తన నెక్స్ట్ సినిమాని కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేయాలని భావిస్తున్నాడు.
‘ఎస్.ఎల్.వి సినిమాస్’ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ‘రామారావు ఆన్ డ్యూటీ’ (Ramarao On Duty) తో రవితేజ.. ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ (Aadavallu Meeku Johaarlu) తో కిషోర్ తిరుమల (Kishore Tirumala) .. సుధాకర్ చెరుకూరికి ప్లాపులు ఇచ్చారు. ఆ సినిమాలు మిగిల్చిన నష్టాలు తీర్చడానికి ఇంకో సినిమా చేసి పెడతామని ముందుగానే అగ్రిమెంట్లో సైన్ చేశారు.
ఇప్పుడు కిషోర్ ఓ మాస్ టచ్ ఉన్న ఫ్యామిలీ స్టోరీని రెడీ చేశాడు. రవితేజకి ఈ కథ వినిపించి వెంటనే ప్రాజెక్టు ఓకే చేసుకున్నారు. 2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అదే టైంకి అనిల్ రావిపూడి (Anil Ravipudi) – చిరంజీవి (Chiranjeevi) సినిమా కూడా వస్తుందని ప్రకటించారు. సో 2026 సంక్రాంతికి ఈ 2 సినిమాలు కర్చీఫ్ వేసుకున్నట్లే అని చెప్పాలి.